పిన్నెల్లికి హైకోర్టులో షాక్.. బెయిల్ నిరాకరణ..

Spread the love

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి కోర్టులో షాక్ తగిలింది. ఎన్నికల సమయంలో జరిగిన హింసకు సంబంధించిన కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. గుంటూరు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావుపై దాడి, ఆ తర్వాతి రోజున విధి నిర్వహణలో ఉన్న కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలోనూ పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

తనకు బెయిల్ ఇవ్వాలని మాచర్ల కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన గుంటూరు జిల్లా నాలుగో అదనపు జిల్లా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ పిటిషన్ పై కోర్టు విచారించింది. తనకు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి తరఫు న్యాయవాదులు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని కుమార్ మాత్రం ఆయనకు బెయిల్ ఇవ్వరాదని వాదించారు.

 

మాజీ ఎమ్మెల్యే నేరపూరిత చర్యలను పరిగణనలోకి తీసుకోవాలని అశ్విని కుమార్ వాదించారు. అంతేకాదు, కేసు నమోదయ్యాక కూడా పిన్నెల్లి లొంగిపోకుండా పరారీలో ఉన్నారని, కోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన తర్వాతే పోలీసులకు లొంగిపోయాడని గుర్తు చేశారు. విచారణకు కూడా మాజీ ఎమ్మెల్యే సరిగ్గా సహకరించడం లేదని ఆరోపించారు. ఉభయ పక్షాల మధ్య వాదనలు విన్న కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు ఇదే పిటిషన్ పై తీర్పు వెలువరించింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్‌ను నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *