హరీష్‌రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..?

Spread the love

బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. లేటెస్ట్‌గా మాజీ మంత్రి హరీష్‌రావు కష్టాలు మొదలయ్యాయి. ఆయనపై పంజాగుట్టు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

 

తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని బాచుపల్లికి చెందిన చక్రదర్‌గౌడ్ అనే వ్యక్తి పంజాగుట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వేధింపులు మాత్రమే కాకుండా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించాడు. దీంతో హరీశ్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

 

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. అధికారం పోయిన తర్వాత నేతలు పార్టీ నుంచి వెళ్లిపోవడం, కేడర్ కలిసి రాకపోవడంతో కష్టాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశం నేరుగా హరీష్‌రావు మెడకు చుట్టుకున్నట్లు అయ్యింది.

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ బీఆర్ఎస్ నేతల బాగోతాలు బయటపడుతున్నాయి. ఇదే కేసులో పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు హరీష్‌రావుపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా చక్రధర్ గౌడ్ లాంటి బాధితులు ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సివుంది.

 

రాధాకిషన్‌రావు, హరీష్‌రావులపై అనేకసార్లు ఫిర్యాదు చేశారు చక్రధర్. గతంలో రైతులకు సంబంధించిన విషయంలో తాను చెక్ లు ఇచ్చానని, వారికి ఆదుకున్నానని గుర్తు చేశారాయన. ఆ సమయంలో తాను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమేకాకుండా కేసులు పెట్టి జైలుకి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.

 

ఫోన్ ట్యాపింగ్ చేసి నా కదలికలను ఎప్పటికప్పుడు రాధాకిషన్‌రావు గుర్తించి హరీష్‌రావుకు సమాచారం ఇచ్చేవారని అందులో పేర్కొన్నారు. హరీష్‌రావు వల్లే తాను సర్వం కోల్పోయాలని బయటపెట్టాడు. ఈ అంశంలో చక్రధర్ నుంచి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు జైలులో ఉండగా, రేపో మాపో హరీష్‌రావు నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *